38.2 C
Hyderabad
May 2, 2024 21: 25 PM
Slider కృష్ణ

హై కోర్టులో ఎపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

#APHighcourt

అర్ -5 జోన్ లో ఇళ్ళ నిర్మాణంపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మళ్లీ మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాలను ఆపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేయడం అందుకోసం, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.

రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, దమ్మాలపాటి శ్రీనివాస్, కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. భూ సమీకరణ నిబంధనలను అమలు చేశాకే ఆ భూములపై ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకి హక్కులు దఖలు పడతాయన్నారు. రాజధానేతర ప్రజలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి వీల్లేదని వాదించారు.

అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగించాలన్నారు. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా రాజధానేతర నివాసులకు ఇళ్లు నిర్మించబోతున్నారని అన్నారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతిలో భూములను అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ ఇళ్ల స్థలాలకు ఇవ్వడం అక్రమం అని, కేటాయిస్తున్న 1402 ఎకరాలకు ప్రభుత్వం నుంచి సీఆర్‌డీఏకి ఇప్పటి వరకు పైసా చెల్లించలేదన్నారు.

అందువల్ల ఆ భూముల విషయంలో ప్రభుత్వానికి అధికారం లేదని.. వాటిలో స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం చెల్లదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ తరఫున అదనపు ఏజీ పి.సుధాకర్‌రెడ్డి, కె.జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. భూములపై ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకి హక్కు దఖలు పడలేదన్న పిటిషనర్ల వాదన సరికాదని అన్నారు. హక్కు ఉన్నందునే గత ప్రభుత్వం 16 వందల 56 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించిందన్నారు.

భూములిచ్చిన రైతులకు ఇప్పటికే ప్లాట్లు కేటాయించి ధ్రువపత్రాలు ఇచ్చామన్నారు. దీంతో రాజధాని భూములపై ప్రభుత్వానికి హక్కు దఖలు పడిందన్నారు. ఆ భూముల్లో ఇళ్ల స్థలాలిచ్చే హక్కు ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇళ్ల పట్టాల జారీకి అనుమతిచ్చిందంటే అందులో ఇళ్లు నిర్మించుకోవడానికీ అనుమతి లభించినట్లే భావించాలన్నారు.

స్థలాల కేటాయింపు ఇళ్ల నిర్మాణంలో భాగమని రెండింటినీ వేర్వేరుగా చూడకూడదన్నారు. ఇళ్ల పట్టాలో షరతును ‘తప్పుగా పేర్కొన్న’ మాట వాస్తవమేనన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఆర్​5 జోన్​లో ఇళ్ల నిర్మాణాలపై నిర్ణయాన్ని వాయిదా వేసి తాజాగా స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts

వరల్డ్ పోలియో డే సందర్భంగా విజయనగరం లో సైకిల్ ర్యాలీ

Satyam NEWS

ఇంటింటా జ్వర సర్వే: లక్షణాలు ఉన్నవారికి ఐసోలాషన్ కిట్ల అందచేత

Satyam NEWS

నటి సయోనిఘోష్‌ అరెస్ట్‌.. త్రిపురలో బీజేపీ టీఎంసీ వార్

Sub Editor

Leave a Comment