నిరుపేదల పొట్టగొడుతున్న వైసీపీ నేతలపైనా వారికి సహకరిస్తున్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియెజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.
నరసరావుపేట రూరల్ పరిధిలోని స్వప్న ట్రేడర్స్ లో 4000ల బస్తాల రేషన్ అక్రమ నిల్వలలో సూత్రదారులను, పాత్రధారులను బయట పెట్టేందుకు తక్షణమే విచారణ జరపాలని ఆయన కోరారు.
రేషన్ మాఫియాకు సహకరిస్తున్న రెవిన్యూ, పోలీస్ సిబ్బంది పాత్రపై క్షుణ్ణంగా విచారణ చేయించాలని ఆయన కోరారు. పట్టుబడిన 4000 ల బస్తాల రేషన్ బియ్యాన్ని ఏయే డీలర్ల వద్ద నుండి సేకరించారో విచారణ జరిపి ఆయా డీలర్లను తక్షణమే సస్పెండ్ చెయ్యాలని అరవిందబాబు డిమాండ్ చేశారు.
ఇంత భారీగా రేషన్ బియ్యం వ్యాపారం జరుగుతుంటే పౌరసరఫరాల శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? రేషన్ మాఫియాలో నరసరావుపేట ఎమ్మెల్యే అనుచరుడు పుల్లారెడ్డితో పాటు ఎంత మంది ఈ అక్రమ వ్యాపారంలో ఉన్నారో అధికారులు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి పాల్పడ్డ వారి పై పీడీ యాక్ట్ ను అమలు పరచాలని, రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి సహకరిస్తున్న అధికారులను వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చెయ్యాలని అరవిందబాబు డిమాండ్ చేశారు.
అక్రమంగా భారీ స్థాయిలో రేషన్ బియ్యం మాఫియా ముఠాకు నాయకునిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని ముఖ్యమంత్రి జగన్ పార్టీ నుండి సస్పెండ్ చేసి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరారు.
ఇప్పటికే కల్తీ పాలు,అక్రమంగా ఇసుక వ్యాపారం, కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ శానిటైజర్ల వ్యాపారులను ప్రోత్సహిస్తూ అక్రమ వ్యాపారులకు అండగా నిలుస్తున్న వారిపై ప్రభుత్వం సీతకన్ను వేయడం భావ్యమా?
అక్రమ వ్యాపార కుంభకోణాలను తమ అనుచరులతో చేయిస్తూ ప్రజారోగ్యమేమైనా లాభార్జనే మాకు ముఖ్యమంటున్న అక్రమ వ్యాపారాలను ప్రజలు, ప్రభుత్వం, అధికారులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కొల్లి బ్రహ్మయ్య, శేఖేర్, మబు, రయప్ప, శ్యామ్, మధు తదితరులు పాల్గొన్నారు.