నిన్న రాత్రి వరకూ ఉన్న ఏటీఎం మెషిన్ ఒక్క సారిగా మాయం కావడం స్థానికులను ఆశ్చర్యపరచింది. హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరు పరిధిలోని రుద్రారంలో ఈ ఘటన జరిగింది. ఎలా జరిగిందా అని వారు ఆశ్చర్యపోతున్నారు. చివరికి తేలిందేమంటే కొందరు దొంగలు మొత్తం మిషన్ ను తవ్వి తీసుకెళ్లారట.
రుద్రారంలో ఇండి క్యాష్ వాళ్ల ఏటిఎం ఉంది. శనివారం రాత్రి గుర్తుతెలియని కొందరు వ్యక్తులు దాన్ని యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరేష్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. దొంగలు తీసుకెళ్లిన సమయానికి ఏటీఎం మిషన్ లో రూ.2.27 లక్షలు ఉన్నట్టు ఇండీక్యాష్ ప్రతినిధులు తెలిపారు. పోలీసులు క్లూస్ బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు.
అర్ధరాత్రి ఒంటిగంట దాటాక ఘటన చోటు చేసుకున్నట్టు వెల్లడి అయింది. దుండగులు చోరీకి ముందు సీసీ కెమెరా తీగలు కత్తిరించారు. అక్కడికి సమీపంలో ఓ టిఫిన్ సెంటర్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఐదుగురు వ్యక్తులు ఏటీఎంను పెకిలించి మినీ డీసీఎంలో తరలించినట్టు భావిస్తున్నారు. ఇదే ఏటీఎంలో గతంలోనూ రెండు సార్లు చోరీయత్నం జరిగింది.