చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల పరస్పర గొడవకు దిగడంతో అంగళ్లు దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చింపేయడం, ఆతర్వాత జరిగిన గొడవల్లో టీడీపీ ఎంపీటీసీ దేవేందర్ గాయపడ్డాడు. పోలీసులు సర్దిచెప్పినా రెండు వర్గాలు వినకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా అంగళ్లులో మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దాక్కోవడం కాదు, దమ్ముంటే రమ్మని పిలిస్తున్నానంటూ సవాల్ విసిరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంట్రీ మొదలు.. చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం కూడా ఇలాంటి హైటెన్షన్ వాతావరణం కనిపించింది. మొదట పుంగనూరు మీదుగా చంద్రబాబు సోంపల్లి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాల్సి ఉంది. అయితే గో బ్యాక్ చంద్రబాబు నినాదాలతో రోడ్డుపైకి వచ్చారు వైసీపీ కార్యకర్తలు. మొదట మొలకల చెరువు వద్ద భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
అదే సమయంలో అక్కడ మోహరించిన వైసీపీ శ్రేణులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ శ్రేణులకు పోటీగా టీడీపీ శ్రేణులు మోహరించడంతో ఉద్రిక్తత ఎక్కువైంది. పోలీసులు సర్దిచెప్పినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. మరోవైపు పుంగనూరులోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించింది వైసీపీ. దీంతో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఇప్పటికే పుంగనూరులో భారీగా మోహరించారు పోలీసులు. మరోవైపు రాళ్లదాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీపీ అధినేత మండిపడ్డారు. గాయపడిన కార్యకర్తలకు వెంటనే చికిత్స చేయించాలని పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు.
పరస్పర దాడులతో పుంగనూరు లో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో 20కి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసు వాహనాలకు సైతం ఆందోళనకారులు నిప్పు బెట్టారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆందోళన కారుల పై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.