తమ నాయకురాలు వై ఎస్ షర్మిల పై చెప్పుల దాడిలో మంత్రి జగదీష్ రెడ్డి హస్తం ఉందని వై ఎస్ ఆర్ టి పి నాయకులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల కేంద్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను తెరాస నాయకులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
అడ్డుకోవడమే కాకుండా షర్మిలపై చెప్పుల దాడి చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకునేందుకు తెరాస నాయకులను మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఉసిగొల్పారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ ఇరువురి ఆదేశాలతో వీధి రౌడీల్లా మారిన TRS నాయకులు తమపై దాడి చేశారని వారన్నారు.
తమ పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలపైనా దాడులు చేశారని, ఒక మహిళా నాయకురాలి చేతికి తీవ్ర గాయం అయిందని వారు తెలిపారు. ప్రజా స్వామ్యం అడుగడుగునా ఖూనీ చేస్తున్న TRS నాయకులు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయారని వారు ఆరోపించారు.