దాదాపు ఆరు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్ పై బొంబాయి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీర్పును రిజర్వు చేస్తూ సెషన్స్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
దాంతో అర్నబ్ గోస్వామి బెయిల్ తిరస్కరించినట్లు అయింది. ఈ నెల 4వ తేదీ నుంచి అర్నబ్ గోస్వామి జ్యుడీషియల్ కష్టడీలో ఉన్నారు. సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే చేసిన సుదీర్ఘ వాదనలు అర్నబ్ గోస్వామికి బెయిల్ ఇప్పించలేకపోయాయి.
జస్టిస్ ఎస్ ఎస్ షిండే, జస్టిస్ ఎం ఎస్ కార్నిక్ లు ఆదేశాలను రిజర్వు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2018లో రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించకపోవడంతో డిజైనర్ అన్వే నాయక్తోపాటు ఆయన తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్కిటెక్ట్ కుమార్తె అద్యా నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు తిరిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 4న అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేశారు. ఆ మరునాడు ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు అంశాన్ని పూర్తిగా పరిశీలించాలని పేర్కొన్న కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.