అక్రమ అరెస్టులు, కేసులకు భయపడేది లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజల్లో తమ పార్టీకి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని బాలకృష్ణ ఆరోపించారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని తెలిపారు. ప్రజల్లో తెలుగుదేశానికి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకు భయపడేది లేదని బాలకృష్ణ తేల్చిచెప్పారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం శాసనసభాపక్షం నివాళులర్పించింది. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే ప్రధాన అజెండాగా చట్టసభలకు వెళ్తున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టంచేశారు. చేసిన తప్పునకు ప్రభుత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాకే మరే అంశమైనా తీసుకోవాలన్నారు.
సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు. తెలుగుదేశం శాసనసభపక్షం నిరసనలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ‘చంద్రబాబుపై కక్ష – యువత భవితకు శిక్ష’ అంటూ ఎమ్మెల్యేలు ప్లకార్డుల ప్రదర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు.