హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటు పై కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో ఓ కమిటీ వేయాలని భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు.
భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఫార్మా సిటీ అనుమతులపై కేంద్రం కమిటీ వేసి, ఆ కమిటీ స్వయంగా ఫార్మా సిటీ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా హైదరాబాద్ ఫార్మా సిటీ కి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఫార్మా సిటీ కారణంగా భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గంలోని అనేక గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా చిట్యాల, పోచంపల్లి, చౌటుప్పల్, తదితర గ్రామాలపై ఫార్మా కంపెనీల ప్రభావం పడుతుందన్నారు.
భూగర్భ జలాలు, గాలి, పర్యావరణం పూర్తిగా కాలుష్యం అవుతుందన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా సిటీ అనుమతులపై పునరాలోచన చేయాలని కోరారు.