పశ్చిమ బెంగాల్ తరహా దాడులు సహించమని, అలా చేసిన వారు తగిన మూల్యం చెల్లిస్తారని కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు హెచ్చరించారు. విజయనగరం పట్టణంలోని వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసిన నారాయణ రావు పై హత్యాయత్నం చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
యువకుడైన నారాయణరావును రాజకీయంగా ఎదిరించలేక అధికారం ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేయాలని చూడటం సహించేది లేదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు గత రెండు రోజుల నుండి అనేక రకాల గొడవలు చేసినా ఆయన లొంగకపోవడంతో గత రాత్రి 8 గంటల సమయంలో నారాయణ రావు ఇంటి వద్దకు వెళ్లి సుమారు నలభై మంది వైఎస్ఆర్ సీపీ గుండాలు అత్యంత దారుణంగా సుమారు నలభై కత్తిపోట్లు దిగే విధంగా హత్యా ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.
ఇది పూర్తిగా పిరికిపంద చర్య అని, వైయస్సార్సీపి గుండాల హత్య రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఇదని ఆయన అన్నారు.