పంజాబ్ పాలిటిక్స్ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, వ్యూహాలకు పదును పెట్టాయి ప్రధాన పార్టీలు. తాజాగా కెప్టెన్ అమరీందర్ సింగ్ అమిత్షాను కలవడం పంజాబ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో అమరీందర్ సింగ్, సుఖ్దేవ్ సింగ్ దిండ్సా పార్టీల పొత్తు కొలిక్కి వచ్చింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఆ పార్టీ అగ్రనాయకులతో అమరీందర్ సింగ్, సుఖ్దేవ్ సింగ్ దిండ్సా భేటీ అయ్యి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ భేటీ తర్వాత కీలక విషయాలు వెల్లడించారు గజేంద్రసింగ్ షెకావత్.
సీట్ల పంపకాల కోసం ప్రతి పార్టీ నుంచి ఇద్దరు నేతలతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు షెకావత్. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు రైతు సంఘాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. అమరీందర్ సింగ్, దిండ్సా బీజేపీతో జత కట్టడం వల్ల రాష్ట్రంలో సిక్కుల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాషాయ నేతలు. అయితే, బీజేపీపై ఉన్న వ్యతిరేకత తమకు లాభిస్తుందని అంచనాలు వేస్తోంది కాంగ్రెస్.