కరోనా మూలంగా ప్రజలకు కనీస వసతులు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, చీకటి జీవోలు తీసుకువస్తున్నారని, ప్రశ్నించిన అధికారుల ను సస్పెన్షన్ చేసి వారిపై అధికార దాడి చేయడమేనని రాష్ట్ర బీజేవైయం అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు.
కడప జిల్లా రాజంపేట లోని స్వగృహంలో శుక్రవారం రాష్ట్ర బీజేవైయం అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో పారదర్శక పాలన అందిస్తానని చెప్పి ఇప్పడు చీకటి జీవోలు ఇస్తున్నాడని ఆరోపించారు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఇచ్చింది చీకటి జీవోనే అని అన్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం వలనే నేడు ప్రజల ప్రాణాలు దక్కాయని తెలిపారు. దీని మూలంగా ప్రజల దృష్టిలో నిమ్మగడ్డ ప్రసాద్ దేవుడయ్యారని ఆయన అన్నారు.
అందుకే జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక ఇబ్బందులు పెడు తున్నారని ఆరోపించారు. ఎన్నికలు జరిగి ఉంటే నిజాముద్దీన్ ఘటన తో కరోనా మహమ్మారి విస్తరణ లో ఏపీ ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంబంధించి కనీస అవసరాలు తీర్చడం లో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆయన అన్నారు.
దీనిపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ దృష్టికి సమస్యలు తెచ్చిన డాక్టర్ సుధాకర్ ను, నగరి మునిసిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ని సస్పెండ్ చేశారని, ఇలా చేయడం ఇదీ అధికారిక దాడిగా బీజేపీ భావిస్తోందన్నారు.