గ్రామీణ ప్రజలకు విస్తృత సేవలను అందిస్తున్న తపాలా శాఖను ప్రైవేటుపరం చేసి,కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టి,తపాలా శాఖను కాపాడాలని,ఆగస్టు 10వ,తేదీన జరిగే సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ బిల్డింగు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో శీతల రోషపతి మాట్లాడుతూ అత్యంత నిజాయితీతో ఒక లక్షా 56వేల 434 పోస్ట్ ఆఫీసుల ద్వారా 90 శాతం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్న నాలుగు లక్షల పైగా ఉన్న ఉద్యోగులు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న తపాలా శాఖను ప్రైవేట్ పరం చేయటం అన్యాయమని అన్నారు.
గతంలో ప్రభుత్వం ప్రైవేటు ప్రయత్నాలు ఉద్యోగ సంఘాల ద్వారా ఐక్య పోరాటల ద్వారా తపాలా శాఖను కాపాడుకున్నారని అన్నారు.నూతన ఆర్థిక విధానాలలో భాగంగా ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని తీవ్రంగా విమర్శించారు.ఇందులో భాగంగానే జీవిత భీమా,బ్యాంకింగ్ పార్సల్,ఉత్తరాల సేకరణ, బట్వాడాలను ఒక్కొక్కటిగా హబ్ గా ముక్కలు చేసి పెట్టుబడి శక్తిలకు దోచిపెట్టే దిశగా వేగంగా పావులు కదుపుతుందని విమర్శించారు. తపాల శాఖను ప్రజలకు దూరం చేసేందుకు బిజెపి కుట్ర చేసిందని, దీనిని ప్రజల ఐక్యతతో చారిత్రక చరిత్ర కలిగిన విశ్వాస సేవలను అందరూ కాపాడుకోవాలని,ఇది ప్రజల బాధ్యత అన్నారు.ఆగష్టు 10న,జరిగే సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలక సోమయ్య గౌడ్, ముస్తఫా,రాములు,పోస్టల్ డిపార్ట్మెంట్ ఎన్ ఎఫ్ పి ఈ యూనియన్ నాయకులు గోపీ నాయక్,రణపంగు అశోక్,పి శ్రీనివాస్, చంద్రశేఖర్,ఉప్పతల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
హుజూర్ నగర్ సత్యం న్యూస్