మసీదులు, దర్గాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారతీయ జనతా పార్టీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మంత్రి వెల్లంపల్లిని వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. నెల్లూరులోని విఆర్సీ సెంటర్ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు వెల్లంపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యత గల దేవాదాయ, ధర్మాదాయ శాఖకు మంత్రిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. మంత్రి పదవికి రాజీమానా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా నేత యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి హిందువుల మనోభావాలను అగౌరపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. మంత్రిగా కీలకంగా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి ఆయన చేసే మంత్రిత్వ శాఖ దేవదాయ, ధర్మాదాయ శాఖ అనే విషయాన్ని మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.
దేవాదాయశాఖకు మంత్రిగా ఉంటూ అన్యమతాలకు సంబంధించి చర్చీలు, మసీదులు, దర్గాలు కట్టిస్తాం అని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఇంకో శాఖ మంత్రిగానే, లేకా ఎమ్మెల్యే గానో చెప్పుకోవచ్చు గానీ దేవదాయశాఖ మంత్రిగా ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్ఠకరమని, ఆయనకు మంత్రిగా కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వమే ఆయన్ను భర్తరఫ్ చేయాలన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవాలని చూస్తే బిజేపి చూస్తూ ఊరుకోదని యశ్వంత్ సింగ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజేవైఎమ్ నగర అధ్యక్షులు అశోక్, ఫణిరాజు, సాంబ, చంద్ర, రాజశేఖర్ పాల్గొన్నారు.