సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర హాస్పటల్ లో బుధవారం ఒక మహిళకు రక్తదానం చేసిన జనచైతన్య ట్రస్ట్ ఆమె ప్రాణాన్ని నిలిపింది. గర్భసంచి ఆపరేషన్ చేసేందుకు వీలుగా ఆమెకు ఎబి పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాల్సి వచ్చింది. దాంతో విజయ అనే మహిళ జనచైతన్య ట్రస్ట్ నిర్వాహకులు పినపరాళ్ళ వంశీ, పారా సాయి, పిల్లి శివశంకర్ లకు సమాచారం అందించింది. వెనువెంటనే స్పందించి జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్ హాస్పిటల్ వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకొని కోదాడ లోని తిరుమల బ్లడ్ బ్యాంకు వద్దకు వెళ్ళి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక మాతృమూర్తికి రక్తదానం చేయడం చాలా సంతోషకరంగా ఉందని,ఇదేవిధంగా రక్తదానం చేయాల్సిన బాధ్యత ఆరోగ్యంగా ఉన్న ప్రతి పౌరుడికి ఉందని అన్నారు. రక్తదానం అందరూ చేస్తున్నారా లేదా అని ఒకమారు ఆలోచించాలని, మనం జీవిస్తూ మన రక్తదానంతో మరో ముగ్గురిని జీవించేందుకు అవకాశం కల్పిద్దామని అన్నారు.
మన చేతులతో సాయం చేద్దామని, హృదయంతో ప్రేమను పంచుకుందామని, మన రక్తాన్ని మరొక ప్రాణాన్ని బ్రతికించేందుకు 3 నెలలకు ఒక సారి రక్తదానం చేద్దామని అన్నారు. రక్తదానం చేద్దాం – ప్రాణ దాతలుగా నిలుద్దామని, రక్తం అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి జనచైతన్య ట్రస్ట్ అన్నివేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్