కరోనాతో జనం చచ్చిపోతున్నాకులాలు, మతాలు పేరుతో రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాలు, మతాలు, వైద్యం వేరు వేరు కాని రాష్ట్రంలో మాత్రం అన్నిటికీ ఒకే విధంగా చేస్తున్నారని, రాష్ట్రంలో అధికారపక్షానికో చట్టం, ప్రతిపక్షానికో చట్టం నడుస్తోందని ఆయన అన్నారు.
దేవాలయాల్లో తాత్కాలిక క్వారంటైన్లు పెట్టారని చెబితేనే రాజద్రోహం కింద కేసు పెట్టారని ఆయన అన్నారు. చిన్నపోస్టు పెట్టారని రాష్ట్ర సరిహద్దులు దాటి అరెస్టు చేశారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కోట్ల మంది మనోభావాలను దెబ్బతినేలా వ్యవహరించిన వారిపై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
ప్రధాని, అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎంపై దారుణమైన పోస్టులు పెడితే అరెస్టు చేయరా అని ఆయన ప్రశ్నించారు. కరోనా విజృంభణకు కారణమైన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫాపై కేసు ఎందుకు పెట్టరు అని ఆయన ప్రశ్నించారు.
కరోనా వ్యాప్తికి కారణమవుతున్న కర్నూలు ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్సీ ఇక్బాల్ పై ఎందుకు కేసు పెట్టరు? అని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలు చెబుతున్న జర్నలిస్టులపై కూడా కేసులు పెడుతున్నారని, మంత్రులు మాట్లాడుతున్న బూతు మాటలు ప్రవచనాలుగా వినపడుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు.
కరోనా సమయంలో కూడా రాజకీయాలు అవసరమా? కోర్టులు 55 సార్లు మొట్టికాయలు వేసినా తీరు మారడం లేదు అని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు అధికారులను బెదిరించి వ్యాధిని మరింత వ్యాప్తి చేసిన మాట నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు.