ప్రతీ పోలీస్ స్టేషన్ లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశంపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలితాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పరమ్ వీర్ సింగ్ సయానీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు నేడు రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది.
షఫీ మొహ్మద్ వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కేసులో ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.
2018 జులై 15న తాము ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాయో తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
మానవ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందువల్లే క్రైమ్ నమోదు తదితర అంశాలను వీడియో, ఆడియో చిత్రీకరణ జరపాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.
దీనితో ఏకీభవించిన సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.