సెల్ టవర్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ CCS ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన కాలనీ వాసులు
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని మధురానగర్ ఇండ్ల మధ్యనున్న jio సెల్ టవర్ నుంచి మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భారీగా శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి.
అరగంట పాటు మంటలు రావడంతో కాలనీవాసులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జియో టవర్ బ్యాటరీ బాక్స్ లనుంచి ఉదయం వరకు పొగలు వచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల మధ్యలో సెల్ టవర్ వద్దంటూ తాము వ్యతిరేకిస్తూ నెత్తి నోరు మొత్తుకున్నా పట్టించుకోకపోవడం మూలంగానే పేలుళ్లు సంభవించాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికంతటికీ జిహెచ్ఎంసి ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఇళ్ల మధ్య నుంచి సెల్ టవర్ ను ఎత్తివేయాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సెల్ టవర్ లో అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ యాదవ్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు.
పేలుళ్లకు కారణమైన జియో సెల్ టవర్ సంస్థపై స్థలం యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీవాసులు సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు. ఆందోళన కార్యక్రమంలో సి సి ఎస్ ప్రతినిధులు, మధుర నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎంపల్లి పద్మా రెడ్డి, శ్రీనివాస్, వాకిటి అనిలా రెడ్డి, లక్ష్మి, మంజుల నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి