ప్రజాస్వామ్యం బతికి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు రద్దుచేసి కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాల నేతృత్వంలో ఎన్నికలు జరపాలని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా వస్తుందని భావిస్తే నామినేటెడ్ పద్ధతిలో ఎన్నికలు జరుపుకోండని ఆయన అన్నారు.
ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలనలో అవకతవకలు జరిగాయని, దేవగుడి ఎంపీటీసీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆవుల ఆమోసు నామినేషన్ రద్దు చేసి మళ్లీ ఎంపిక చేయడమే ఒక పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో అనేక చోట్ల బెదిరింపులకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.
ఆర్డినెన్స్ పెట్టడం, నిఘా యాప్ ఏర్పాటు చేయడం అంతా మోసమేనని, వైసిపి కౌంటింగ్ లో తారుమారు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రిటర్నింగ్ అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారారని ఆయన ఆరోపించారు.