తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానం మూలంగా సాగు, దిగుబడులు పెరుగుతున్నాయని, దీన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం విచారకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
మద్దతు ధరకు కంది పంట కొనుగోలు పరిమితి పెంచాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం 5 ఏళ్ల సగటు సాగును పరిగణనలోకి తీసుకుని దిగుబడిలో 25 శాతం పంటకే మద్దతు ధర వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు.
కేంద్రం ఈ ఏడాది తెలంగాణలో సాగయిన కంది పంట దిగుబడి పరిగణనలోకి తీసుకొని ఎం.ఎస్.పి పై కొనుగోలు చేయాలని మంత్రి కోరారు.
యాసంగి పంటలు, కొనుగోళ్లు, ఎరువుల వినియోగం, భూసార పరీక్షలు, ప్రత్యామ్నాయ పంటలు, ఉత్తమ సాగు పద్దతులు తదితర అంశాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖా కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.భాస్కరా చారి, ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రాములు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నియంత్రిత సాగులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును గౌరవించి 10.80 లక్షల ఎకరాలలో కందులను సాగుచేశారని మంత్రి తెలిపారు.
వాతావరణం అనుకూలించి కంది పంట ఆశాజనకంగా ఉంది ..దిగుబడి పెరగనుందని ఆయన అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రైతు పార్వతి లచ్చయ్యకు ఫోన్ చేసి మంత్రి అభినందించారు.