దళిత బంధు, ఉచిత విద్యుత్, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని, దళితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17న జరిగే ఛలో కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని కెవిపిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. కెవిపిఎస్ జిల్లా నాయకులు ఎస్.కె. సైదులు అధ్యక్షతన గుమస్తాల సంఘం భవనంలో దళితుల విస్తృత జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా మనోహర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దళిత బంధు పథకాన్ని ప్రతి దళిత కుటుంబానికి అందేలా చర్యలు చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళిత బంధు పేరుతో ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేయకుండా తక్షణమే కొత్త యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి ఎలాంటి కొర్రీలు లేకుండా రుణాలు మంజూరు చేయాలని, 342 జీఓ ప్రకారం ప్రతి దళిత కుటుంబానికి 101 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. దళిత బంధు అమలుకై ఈ నెల 17న జరిగే ఛలో కలెక్టరేట్ ను దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ త్రీ టౌన్ అధ్యక్షులు మాగి భద్రయ్య, నాయకులు జంగం నగేష్, కాంపాటి రామస్వామి, పోతురాజు జార్జి, హిమాం తదితరులు పాల్గొన్నారు.