మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రిమాండ్ విధిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు నిర్ణయం వెలువరించింది. ఆయనపై జగన్ రెడ్డి ప్రభుత్వం మోపిన అభియోగాలపై ఉదయం నుంచి సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నావోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడి తరపున సిద్దార్థ లూథ్రా కేసు వాదించారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 6.15 గంటలకు ఆయనను నంద్యాలలో అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు తరలించారు. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారన్న విషయాన్ని అటు సీఐడీ అధికారులు, ఇటు పోలీసులు చివరి వరకూ గోప్యంగా ఉంచారు.
ప్రస్తుతం చంద్రబాబును ఏసీబీ కోర్టు ముందుంచారు. ఓపెన్ కోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ఆదివారం ఉదయం హాజరుపరిచారు. గతరాత్రి సుదీర్ఘంగా ఆయనను పోలీసులు విచారించారు. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 2021 ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో తాజాగా ఆయన పేరును పోలీసులు చేర్చారు.
ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. పరిసరాలను మొత్తం పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఓపెన్ కోర్టులో వాదనలు వినాలని కోర్టుకు చంద్రబాబు నాయుడు తరఫు లాయర్ల బృందం విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి కోర్టును సానుకూలంగా స్పందించింది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబును ముఖ్య కుట్రదారుగా సీబీసీఐడీ పేర్కొన్నది.
ఎఫ్ఐఆర్లో ఏ37గా పేర్కొంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. సీమెన్స్ కంపెనీకి ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని, అందులోని 270 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపణలు వినిపించారు. డిజైన్ టెక్, సీమెన్స్ ప్రతినిధులను చంద్రబాబు కలిశారని, క్యాబినెట్ తీర్మానాన్ని పక్కబెట్టి గంటా సుబ్బారావు వంటి అధికారులతో కుట్రపన్నారని ఆరోపణలు.
రిపోర్టులో నారా లోకేశ్ పేరు ప్రస్తావించారు. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా నారా లోకేశ్కు డబ్బులు అందినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. జీఎస్టీ విచారణ మొదలు కాగానే నిందితులు నోట్ ఫైల్స్ మాయం చేశారని ఆరోపించారు. సెక్షన్ 409 కింద వాదనలు ప్రారంభం కాగా.. దీనిపై చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సెక్షన్ సరికాదని అన్నారు. న్యాయమూర్తి హిమబిందు వాదనలు వింటున్నారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలన్న అభ్యర్థనకు అనుమతించారు. సెక్షన్ 409 కింద కేసు పెట్టాలంటే సరైన సాక్ష్యాలు ఉండాలని సిద్ధార్థ లూథ్రా వాదించారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని అభ్యర్థించారు. రాజకీయ కక్షతోనే నాపై కేసు నమోదుచేశారని, నేను ఏ తప్పూ చేయలేదని చంద్రబాబు వాదించారు.
శనివారం ఉదయం 5.40 గంటలకు పోలీసులు నోటీలు ఇచ్చారని, ఇవాళ ఉదయం 5.04 గంటలకు రిమాండ్ రిపోర్టు ఇచ్చారన్నారు. హాలులో ఉంటారా? బయటకు వెళ్తారా? అని న్యాయమూర్తి అడిగితే.. వాదోపవాదాలు ముగిసే వరకూ తాను కోర్టులో ఉంటానని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చంద్రబాబు అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్కు 2015-16 బడ్జెట్లో పొందుపర్చామని, దీనికి రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు. 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కాని.. రిమాండ్ రిపోర్టులో కూడా నా పాత్ర ఉందని ఎక్కడా సీఐడీ పేర్కొనలేదని చంద్రబాబు వాదించారు. వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు పట్ల పోలీసుల అనుసరించిన తీరును కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అరెస్ట్ చేసినవారిని 24 గంటల్లోగా కోర్టు ముందుంచాలని.. తన క్లయింట్ విషయంలో ఈ నిబంధన పోలీసులు పాటించలేదని అన్నారు. చంద్రబాబు దగ్గరకు వచ్చి పోలీసులు మొబైల్ లోకేషన్ రికార్డ్స్ పరిశీలించారని ఆరోపించారు. వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెలువరించారు.