ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు ఆదేశించాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ లకు లేఖ రాశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు ఏపిలో ఉల్లంఘన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పాలక వైయస్ఆర్సీపి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని, ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేయడం చట్టరీత్యా నేరమని ఆయన అన్నారు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైయస్ఆర్సీపి) పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వైయస్ఆర్సీపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలోని ప్రజాస్వామ్య సంస్థలపై ఒక పద్దతి ప్రకారం దారుణమైన దాడి జరిగిందని, ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు, సామాజిక కార్యకర్తలపై అధికార వైయస్ఆర్సిపి దాడులు చేసి బెదిరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 [సెక్షన్ 5 (2)], ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [సెక్షన్ 69] ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ జాతీయ భద్రతకు ముప్పు ఉన్న సందర్భంలో లేదా సార్వభౌమాధికారం, దేశ సమగ్రత ప్రయోజనాల కోసం, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాలకు ముప్పు వాటిల్లే సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు కానీ దైనందిక జీవితంలో వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్ చేయడం నేరమని చంద్రబాబునాయుడు తెలిపారు.
అంతేకాకుండా ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్ జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.