వైసిపి ప్రభుత్వం రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలని, నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలని ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా…ఆలోచనతో స్పందించాలని కోరారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్….ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని చంద్రబాబునాయుడు అన్నారు. ఉద్యోగులను అగౌరపరిచే…ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలని ఆయన కోరారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తాము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.