కరోనా నిబంధనల పేరుతో తన నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
రేపు 5వేల మందితో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు తెలుగుదేశం నేతలు పోలీసులను అనుమతి కోరారు.
కోవిడ్ దృష్ట్యా, గాంధీ బొమ్మ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి అనుమతి నిరాకరించారు.
అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల కూడా ఇన్ని వేల మంది ర్యాలీలు నిరసనలు చేయడానికి అనుమతి ఇవ్వలేమని తెలిపారు.
దాంతో నేడు రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిరసన తెలిపారు.
రేణిగుంట పోలీసులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.