తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రెండు రాష్ట్రాలు భారత్ – పాకిస్తాన్ లా కొట్టుకుంటాయని దీక్షలు చేసిన పెద్దమనిషి వై ఎస్ జగన్ అని చంద్రబాబునాయుడు అన్నారు. అదే కాళేశ్వరం ప్రారంభానికి వెళ్లి టెంకాయ కొట్టి తెలంగాణ సిఎం కేసీఆర్ ను జగన్ పొగిడారని ఆయన గుర్తు చేశారు.
కేసీఆర్ ఉదారవాది, తెలంగాణ భూభాగం మీద నుంచి నీళ్లు పంపడానికి ఒప్పుకున్నారంటూ జగన్ పొగిడిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావని చంద్రబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
తనను చూసి ఎవరైనా భయపడాలనే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ కూడా తెలుగుదేశమే తెచ్చిందని వైకాపా నేతలు అంటారేమోనని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. పేదల అసైన్డ్ భూములను ఇష్టారాజ్యంగా లాక్కుంటూ.. ఇళ్ల పట్టాల ముసుగులో వైకాపా నేతలు భారీ భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.