తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రకాశం జిల్లా పోలీసులు వేధిస్తున్న అంశాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఆయనకు లేఖ రాశారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు వైసీపీ నేతల ఆదేశాలతో మొగిలిచర్లకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించి వేధిస్తున్నారని చంద్రబాబునాయుడు అన్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 6, 10 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారని, పి.రత్తయ్య, ఎం.శ్రీకాంత్ అనే కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆయన తెలిపారు. టీడీపీని వీడాలని చిత్రహింసలకు గురిచేసి అర్థరాత్రి 2 గంటలకు వదలిపెట్టారని, ఉదయాన్నే మళ్లీ 6.30 గంటలకు లింగసముద్రం ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రావాలని బెదిరించారని చంద్రబాబునాయుడు లేఖలో పేర్కొన్నారు. పోలీసుల బెదిరింపులు తట్టుకోలేక రత్తయ్య, శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ సంఘటనతో రాష్ట్రంలో పోలీసుల వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని కొంతమంది పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వైసీపీ నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు పనిచేస్తున్నారని చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందని ఆయన అన్నారు.