ప్రపంచంలో అత్యధిక ప్రజలు ఆచరించే మతం క్రైస్తవ ధర్మం. మానవాళి కోసం క్రీస్తు చేసిన త్యాగం నిరుపమానమైనది. అందుకే ఆయన చూపిన బాట, చెప్పిన మాటను తరాలు గడిచినా మానవులు అనుసరిస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ విస్తరిస్తున్న మతం కూడా క్రైస్తవమే కావడం గమనార్హం.
అయితే ఏసుక్రీస్తు ప్రభువు జన్మించిన ప్రాంతంలో మాత్రం క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రస్తుతం ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఉన్న బెత్లహెమ్లో రెండువేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు జన్మించాడని, ఆ పుణ్యభూమి నుంచే క్రైస్తవమతం వ్యాప్తి ప్రారంభమైందని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం.
ఆ మహాత్ముడు జన్మించిన ప్రదేశాన్ని, ఏసుక్రీస్తు జన్మస్థానంగా భావించే నేటివిటీ చర్చిని నిత్యం ప్రపంచం నలుమూలల నుంచీ క్రైస్తవులు, ఇతర ఆధ్యాత్మిక పర్యాటకులు సందర్శిస్తుంటారు. క్రైస్తవుల పుణ్య క్షేత్రమైన బెత్లహెమ్ లోని ఏసు జన్మస్థానం నుంచి జెరూసలెంలోని శిలువయాగం వరకు ఉన్న రహదారిని ‘స్టార్ స్ట్రీట్’ అంటారు.
బెత్లహెమ్ పట్టణం పాలస్తీనా పరిపాలనలో ఉండగా ఆ పట్టణ సరిహద్దులన్నీ ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంటాయి! యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్ర నగరమైన జెరూసలెంలోని తూర్పుప్రాంతం 1967 నుంచి ఇజ్రాయేల్ అక్రమణలో ఉంది.
జెరూసలెం లోని హోలీ సెవల్చర్ చర్చి నుంచి బెత్లహేమ్ లోని నేటివిటీ చర్చి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ రెండిటి మధ్య ఒక రక్షణ గోడను నిర్మించడంతో పాటు ఒక సైనిక చెక్పోస్ట్ను కూడా ఇజ్రాయేల్ నిర్వహిస్తోంది.
ఏసుక్రీస్తు బాల్యం నుంచి మరణం వరకు గడిపిన ప్రాంతమంతా నేడు పాలస్తీనా- ఇజ్రాయెల్ వివాదంలో మగ్గుతూ నిర్లక్ష్యానికి గురవుతోంది.