నాగర్ కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు పై దాడి చేసి, దూషించి అవమానపరిచిన కొత్తపేట్ సిఐ జానకి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని స్థానిక బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
దాడిని ఖండిస్తూ, కుల దురహంకారంతో కొందరు మంత్రుల, ఎమ్మెల్యేల ప్రోద్బలంతో రెచ్చి పోయిన సిఐ జానకి రెడ్డి తక్షణమే సస్పెండ్ చేయాలని కొల్లాపూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు, మామిడి రైతులు భారీ ఎత్తున మౌన దీక్షలు చేశారు.
మామిడి రైతులు, బిజెపి నాయకులు పార్టీ కార్యాలయాలలో తమ ఇళ్లలో మౌన దీక్షలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కొత్తపేట్ మార్కెట్ కు కొల్లాపూర్ నియోజకవర్గ మామిడి రైతులు అమ్మకాలకు వెళ్లగా అక్కడ మార్కెట్ బంద్ చేయడంతో రైతులు ఎల్లేని సుధాకర్ రావు కు ఫోన్ ద్వారా తమ సమస్యలు చెప్పుకున్నారు.
ఆయన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని రైతుల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఆ ప్రాంత సీఐ జానకి రెడ్డి రైతులపై దాడిచేస్తూ కేసులు పెడతానని బెదిరించారని వారు అన్నారు. సుధాకర్ రావు పై దురుసుగా మాట్లాడుతూ చేయి చేసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని, సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ శాఖ మంత్రి, ఎమ్మెల్యే లు ఉన్నా మామిడి రైతుల సమస్యను పట్టించుకోలేదని, ఎల్లేని సుధాకర్ రావు రైతుల సమస్యలపై మాట్లాడి, అండగా నిలిస్తే దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. రైతు సమస్యను పట్టించుకోని ఈ ప్రాంత ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలని నిరసన తెలిపారు.
సుధాకర్ రావు కు మద్దతు తెలుపుతూ ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మౌన దీక్షలు చేశారు. కొల్లాపూర్ మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్, పాన్ గల్ మండల అధ్యక్షుడు, అన్వేష్, రోజారమణి, మల్లేష్, కొల్లాపూర్ పట్టణ అధ్యక్షుడు కాకి సత్యనారాయణ గౌడ్ కుటుంబసమేతంగా మౌన దీక్షలు చేశారు.
అదేవిధంగా సాయి ప్రకాష్ యాదవ్, సుధాకర్ రావు యువసేన ఇమ్రాన్ ఖాన్,పెద్దకొత్త పల్లి మండల నాయకులు శ్రీనివాస్, మామిడి రైతులు నక్క శ్రీను తదితరులు మద్దతు పలికారు.