ఉమ్మడి కడప జిల్లాలో విద్యాశాఖ లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు విచిత్ర మైన పరిస్థితిని ఎదురుకొంటున్నారు. 2012 లో విద్యాహక్కు చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహాకారంతో సర్వ శిక్షాఅభియాన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియమాలను చేపట్టారు. మొదట 4,500 రూపాయల జీతంతో, రోజుకి రెండు పీరియడ్ల చొప్పున వారానికి 12 పీరియడ్ల లలో పార్ట్ టైమ్ ఉద్యోగులు వారి సబ్జెక్ట్ బోధించాలని ఉన్నతాధికారులు నిర్ధేశించారు.
చాలిచాలని ఇబ్బందులు పడుతున్న వారికి పార్ట్ టైమ్ ఉద్యోగ సంఘాల వినతి మేరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 లో 6 వేల జీతాన్ని తరువాత 2017 లో 14 వేలకు పెంచారు. రాష్ట్రంలో కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిబంధనలు లెక్క చేయకుండా పార్ట్ టైమ్ ఉద్యోగుల ను ఇబ్బందులు పెడుతున్నారని వారికి ఖచ్చితమైన నియమావళి వర్తింపజేయాలని పార్ట్ టైమ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తూ వస్తోంది.
ఈ డిమాండ్ ఇలా ఉండగానే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో మీడియా ముఖంగా పార్ట్ టైమ్ ఉద్యోగుల పై వరాల జల్లు కురిపించారు. వారందరిని ఉద్యోగ భద్రత కల్పిస్తామని, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇందుకు పార్ట్ టైమ్ ఉద్యోగులు ప్రభుత్వం మార్పు తో తమ జీతాలు, జీవితాలు మారతాయని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ ఆడియాశ గా మిగిలింది. మూడు సంవత్సరాలు పైనే అయినా హామీల మాట దేవుడెరుగు వారి నిబంధనలు గాలి కొదిలేసారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలకు వస్తే రోడ్ల కిరువైపులా రంగులు వేయించారు. బొమ్మలు వేయించారు. ముఖ్యమంత్రి సభల్లో ముందు భాగాన నవరత్నాల బొమ్మలు వేయించారు. సర్వేల పేరిట తిప్పారు. ఇసుక క్వారీ లో కాపలా పెట్టారు. సంబంధం లేని ఇన్నీ పనులు చేసినా వారికి దక్క వలసిన ఫలితం దక్కలేదు. ఈ మూడున్నర సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు.
పార్వతీ పురం మన్యం జిల్లా లో విజయ నగరం జిల్లా లో పార్ట్ టైమ్ ఉద్యోగులు మధ్యాహ్నం హాజరు కావాలని జీవో విడుదల చేశారు. కడప జిల్లా లో పి.ఓ అంబవరపు ప్రతాప్ రెడ్డి ఫెసియల్ అటెండెన్స్ వేయాలని జీవో జారీ చేశారు. ఇందులో పార్ట్ టైమ్ ఉద్యోగుల సమయం మాత్రం ప్రస్తావించలేదు. దీనితో పార్ట్ టైమ్ ఉద్యోగుల సమయం పై ప్రధానోపాధ్యాయుల ల్లో పార్ట్ టైమ్ ఉద్యోగుల ల్లో అయోమయం నెలకొంది.
కానీ ఉమ్మడి కడప జిల్లా లో అన్నమయ్య జిల్లా విద్యా శాఖ అధికారి,ఇంచార్జీ పి.ఓ రాఘవ రెడ్డి ఎటువంటి జీవో జారీ చేయకుండానే వాట్సప్ సందేశాలు,మెయిల్స్ ద్వారా రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరి ముఖ చిత్ర హాజరు వేయాలని ఆయా ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఇతర జలాల్లో జీవో జారీ చేసి మరీ పార్ట్ టైమ్ కార్మికులు మధ్యాహ్నం నుంచి రావాలని కోరితే,ఇక్కడ ఉదయం వచ్చి ముఖ చిత్ర హాజరు వేయాలని కోరడం ఏమిటని ఆవేదన చెందుతున్నారు.
పార్ట్ టైమ్ ఉద్యోగులు కనుక మీకు మినిమం టైమ్ స్కెల్ వర్తించే అవకాశం లేదని గతంలో ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. ఇప్పటివరకు బదిలీలు ఒక్కసారి కూడా జరపలేదు ఇప్పుడు రాష్ట్ర కార్యాలయంలో నుండి బదిలీలు అవసరాన్ని బట్టి జరపాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు మాత్రం స్పందించడం లేదు.. పార్ట్ టైమ్ కాకుండా,తాము రెండు పూటలా పని చేసేందుకు సిద్ధమని మినిమం టైమ్ స్కెల్ వర్తింపజేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని మొదటి నుంచి వినతి పత్రాల రూపంలో కోరుతున్నా మని తెలిపారు.
మారుతున్న కాలంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో,అద్దె ఇళ్లల్లో చాలి చాలని జీతాలతో పార్ట్ టైమ్ ఉద్యోగుల కుటుంబ పోషణ భారంగా మారింది. ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం పార్ట్ టైం అనే పదం తొలగించి ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి మినిమం టైమ్ స్కెల్ వర్తింపచేయాలని అప్పటి వరకు తమకు చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు పాత విధి విధానాలను అమలు చేసి తగిన న్యాయం చేయాలని కొరుతున్నారు.