ఎన్నడూ జరగని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో నేరుగా సమావేశం జరపబోతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండిని సిఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని, ఈ సమావేశంలో అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సిఎం కోరారు.
డిసెంబర్ 1న మద్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని, వారికి ప్రగతి భవన్ లోనే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సిఎం చెప్పారు. మద్యాహ్నం భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు.
ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను చర్చిస్తారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండి, ఇ.డి.లు, ఆర్.ఎం.లు, డివిఎంలను ఆహ్వానించారు.