ఆపద, ఆకలితో ఉన్న వారికి అండగా నిలుద్దాం.! చేయి చేయి కలిపి తోచినంత సాయాన్ని అందించేందుకు మనసున్న దాతలు ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేటలోని రంగదాంపల్లిలో సిద్ధిపేట ధార్మిక సేవా సమితి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు కలిగిన ప్యాకెట్లను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో 21 రోజులుగా నిత్యం 500 మందికి తాత్కాలిక రైతు బజారుల్లో, పట్టణ ప్రధాన ప్రాంతాల్లో కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు, ఆకలితో ఉన్న పేద వారికి ఆకలిని తీరుస్తున్నారని అభినందించారు.
ప్రపంచ మానవాళికి కరోనా విజృంభిస్తున్న వేళ..ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేస్తే మంచి గుర్తింపు వస్తుందని., ఆకలితో, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టడం, పైగా వేడి వేడి భోజనం పెట్టి ఆకలి తీరుస్తున్నందుకు సిద్ధిపేట ధార్మిక సేవా సమితి మిత్ర బృందం నేతి కైలాసం, రమేశ్, ఇతర సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రైతు బంధు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.