సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని మంత్రులు తలసాని శ్రీనివాస్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంగళవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి గాంధీనగర్ గ్రామ శివారులోని శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ఎగువన ఉన్న జలాశయంలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…రాష్ట్రంలో కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
తెలంగాణ వచ్చాక మత్స్యకారులకు అన్నిరకాలుగా ప్రయోజనం జరిగిందని, మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుగు నింపారని తెలియజేశారు.
గతంలో మత్స్యకారులకు కేటాయించే అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అన్ని రకాలుగా 100 శాతం సబ్సిడీ అందించడంతో పాటు, వారికి కావలసిన అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పధకాలు వారి జీవితాల్లోకి వెలుగును తెచ్చింది అని అన్నారు.
ముఖ్యంగా వారికి కావలసినటువంటి మోపెడ్ లు, వలలు, వాహనాలు, చేప పిల్లలు, ఐస్ బాక్సులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు. మత్స్య రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న లక్షలాది కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని తెలిపారు.
ఈ సంవత్సరం రాష్ట్రంలోని 81 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లోకి 5 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నామన్నారు. నిర్మల్ లో మత్స్యకారుల కోసం కోటి రూపాయాలతో మత్స్యకార భవన్ నిర్మిస్తున్నామని తెలిపారు.
అనంతరం అంతకు ముందు నిర్మల్ పట్టణంలో విజయ డైరీ పార్లర్ ను మంత్రులు తలసాని, అల్లోల, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రారంభించారు.