నాగర్ కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న 143 రైతు వేదికలకు ఆరు కోట్ల రూపాయలు మంగళవారం సాయంత్రం లోగా విడుదల చేయాలని పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదేశించారు.
సోమవారం సాయంత్రం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం జిల్లా కలెక్టర్ శర్మన్ నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాల పురోగతి సాధించాలని ఆదేశించారు. రైతు వేదికల పురోగతి వారిగా నిధుల విడుదలలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 42 వైద్య వేదికల నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే,కలెక్టర్ సమావేశానికి ఇద్దరు డీ ఈ లు రాకపోవడం ఏంటని ఆర్ అండ్ బీ ఈఈ ప్రగతిని ప్రశ్నించారు.
వారిద్దరికీ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మీరు పని చేయకుండా ఇంట్లో ఉంటే రాష్ట్ర స్థాయి అధికారులకు నేను సమాధానం చెప్పాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చం పేట డివిజన్ పరిధిలో డిఈ రైతు వేదికలకు నిధులు విడుదల చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రేపు సాయంత్రం లోగా నిధులు విడుదల చేయకపోతే చర్యలు తప్పవన్నారు.
క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ రైతు వేదికల,స్మశాన వాటిక ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దామోదరరావు,రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రగతి డీఈలు పాల్గొన్నారు.