ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యారు. నిన్న మొన్నటి వరకూ మోడీని ఆకాశానికి ఎత్తేసిన ఇంటర్నేషనల్ మీడియా ఇప్పుడు అత్యంత దారుణంగా విమర్శిస్తున్నది.
కరోనా కేసులను దాచిపెడుతున్న దేశంగా భారత్ ను ఇంటర్నేషనల్ మీడియా అభివర్ణిస్తున్నది. గత వారం రోజులుగా భారత్ లోని కరోనా వ్యాప్తి వార్తలే అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి.
దేశంలో అత్యంత బలహీనంగా ఉన్న ఆరోగ్య రంగంపై పుంఖాను పుంఖాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలో అత్యంత దారుణంగా ఉన్న ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో పడకలు లేకపోవడం, ప్రాణాధార మందుల కొరత అంతర్జాతీయ మీడియాలో ప్రధాన వార్తలుగా నిలిచాయి.
భారత్ లో కరోనా రెండో దశ వ్యాప్తి ఇంత తీవ్రంగా ఉండటానికి కారణం ప్రణాళికా లేమి అంటూ అంతర్జాతీయ వార్తా పత్రికలు ఘోషిస్తున్నాయి.
ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన స్రవంతి పత్రికలూ నరేంద్రమోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.
లక్షలాది మంది గుమికూడే కార్యక్రమాలకు అనుమతించడం భారత్ చేసిన అతి పెద్ద తప్పిదమని వాషింగ్టన్ పోస్టు విమర్శించింది.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా రావడానికి ప్రధాన కారణం ఇదేనని కూడా వాషింగ్టన్ పోస్టు వివరించింది.
కుంభమేళా లాంటి మత పరమైన కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కలిగిన అనర్థాన్ని కూడా వాషింగ్టన్ పోస్టు వివరంగా రిపోర్టు చేసింది.
భారత ప్రధాని అతి విశ్వాసం కొంప ముంచిందని బ్రిటన్ కు చెందిన ది గార్డియన్ తన సంపాదకీయంలో పేర్కొన్నది.
తన చుట్టూ ఉన్న వారి సలహాలు, అశాస్త్రీయమైన సూచనలు పాటిస్తూ ప్రధాని మోడీ ఈ విపరీత పరిణామంలో కూడా అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నారని గార్డియన్ తెలిపింది.
తాను చేసిన తప్పులను నరేంద్ర మోడీ ఇప్పటికైనా అంగీకరించి వాటికి పరిష్కారం ఆలోచించుకోవాలని గార్డియన్ తన సంపాదకీయంలో పేర్కొన్నది.
భారత ప్రభుత్వం కళ్లు మూసుకుని వ్యవహరించడం వల్లే సెకండ్ వేవ్ అత్యంత దారుణంగా ఉందని కూడా వారు విశ్లేషించారు.
ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన కరోనా నుంచి తనను తాను రక్షించుకున్న భారత్ రెండో దశ రావడానికి తలుపులు తెరిచిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది.
ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా భారత్ లో సెకండ్ వేవ్ అత్యంత ఉధృతంగా ఉందని వారు తెలిపారు.
భారత్ విఫలం కావడం వల్ల అత్యంత తీవ్రంగా ఉన్న కరోనా సెకండ్ వేవ్ ప్రపంచంలోని చాలా దేశాలపై పెను ప్రభావం చూసే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది.
భారత్ లో జరుగుతున్న కరోనా వాక్సినేషన్ ప్రక్రియ అత్యంత నెమ్మదిగా, అత్యంత ప్రభావ హీనంగా జరుగుతున్నదని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది.
దేశంలోని కరోనా రోగుల అత్యంత దయనీయమైన పరిస్థితిని బిబిసి కళ్లకు కట్టినట్లు వివరించింది.
లక్షలాది మంది రోగులకు కనీస వైద్య సహాయం కూడా అందని దుర్భర స్థితిలో భారత్ ఉందని బిబిసి వ్యాఖ్యానించింది.
కరోనా రోగుల కుటుంబాలు వైద్యం కోసం ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాయని, అయినా ఎక్కడా సాయం అందడం లేదని బిబిసి రిపోస్టు చేసింది.
లక్షలాది మంది హాజరైన కుంభమేళా భారత్ కొంప ముంచిందని వారు అభిప్రాయపడ్డారు.
గత ఏడాది తీసుకున్న చర్యలేవీ ఈ సారి తీసుకోకపోవడం వల్లే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉందని ఏబిసి ఆస్ట్రేలియా వ్యాఖ్యానించింది.
ఈ ఏడాది తొలి లోనే కరోనా సెకండ్ వేవ్ కేసులు కనిపించినా ప్రభుత్వ అలసత్వం వల్ల పరిస్థితి చేయిదాటి పోయిందని అమెరికా టైమ్స్ వ్యాఖ్యానించింది.
భారత్ క్షమించరాని తప్పులు చేయడం వల్లే కరోనా సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
ఈ సారి భారత ఆర్ధిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని ఆ పత్రిక విశ్లేషించింది.
భారత ఆరోగ్య రంగం తీవ్ర వత్తిడిలో ఉందని పాకిస్తాన్ కు చెందిన డాన్ పత్రిక వ్యాఖ్యానించింది.
విదేశీ పత్రికలు నరేంద్రమోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా మోడీ గుప్పిటిలో ఉన్న భారత మీడియా మాత్రం ఏ మాత్రం వ్యాఖ్యానాలు చేయడం లేదు.