రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనోవేదనల పరిష్కారానికి దోహదపడే ప్రజాఫిర్యాదుల విభాగాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం కూల్చివేసిందని తెలంగాణ శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ ఆరోపించారు.
‘మంత్రులు, అన్ని శాఖల విభాగాలు చిరునామా లేకుండా పనిచేస్తున్నాయి. శాశ్వత పేషీ లేకుండా పనిచేస్తున్నాయి. ప్రజలు తమ గోడును వినిపించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలి. ఏ అడ్రస్కు ఫిర్యాదు చేయాలి. ఇందుకు ఏవిధమైన వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ప్రజాఫిర్యాదుల విభాగాన్ని నిర్వీర్యం చేసింది. ఇలా చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం.. ‘అని షబ్బీర్ అలీ శనివారం మీడియా ప్రకటనలో తీవ్రంగా తప్పుపట్టారు.
కొందరు మంత్రులు ఫిర్యాదుల యంత్రాంగాన్ని సోషల్ మీడియా వేదికగా భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కే.తారాకరామారావుతో సహా కొందరు మంత్రులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని చెప్పారు.
అది కూడా ఎక్కువగా ప్రచార మే ప్రధానంగా ఉంది. ట్విట్టర్తో పరిచయం ఉన్న కొంతమంది తమ సమస్యలను అతి స్వల్పంగా పంచుకుంటున్నారు. వాటిలో కూడా ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే ట్విట్టర్ ద్వారా మంత్రుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
మంత్రి కూడా తనకు ఎదురైన అన్ని సమస్యలను ట్విట్టర్ ద్వారా పరిష్కరిస్తున్నట్లుగా తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.. వాస్తవానికి పలు సమస్యలను పంచుకుంటున్న వినియోగదారులలో ఎక్కువమంది మంత్రి కార్యాలయం అడ్డుకుంటోంది. లేదంటే అలాంటి ట్వీట్లకు స్పందించడం లేదు. ఇది సామాన్య ప్రజలను అవమానించడమే…’ అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత ఏడేళ్లుగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేరని షబ్బీర్ ఆరోపించారు. సాధారణ ప్రజలను మినహాయించడంలో సీఎం కేసీఆర్ను మంత్రులు కూడా అనుకరిస్తున్నారని విమర్శించారు. కోవిడ్ –19 తో సహా అనేక ప్రజా సమస్యలపై ఫిర్యాదుల విభాగం ఎక్కడా పనిచేయలేదని అన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణను నియంతృత్వంగా మార్చారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ సామాన్యులు తమ గోడు చెప్పుకునే ఫిర్యాదుల యంత్రాంగాన్ని కుప్పకూల్చిందని, ఫిర్యాదుల విభాగం ఉంటేనే సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు వీలుంటుందని, ఈ వ్యవస్థ లేకపోవడం వల్లే ఎంతోమంది ప్రజాహిత వ్యాజ్యాలు (పిల్స్)ను దాఖలు చేసేందుకు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని షబ్బీర్ చెప్పారు.
కోవిడ్ –19 పరిస్థితులను ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోలేదని అనేకసార్లు హైకోర్టు తీవ్ర పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలను షబ్బీర్ ఆలీ ప్రస్తావిస్తూ, హైకోర్టు తగిన తీరిలో సకాలంలో స్పందించడం వల్ల కరోనా కట్టడి జరిగిందన్నారు. ప్రభుత్వం ఉదాశీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించి ప్రజారోగ్య పరిస్థితులు చేజారిపోకుండా చేసిందని కొనియాడారు.
కోర్టు సరైన సమయంలో జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయేది. ‘హైకోర్టు ఆదేశాల తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచింది. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకుంది. కోవిడ్ చికిత్స కోసం అధిక మొత్తాలను వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. మళ్ళీ హైకోర్టు జోక్యం తర్వాతే వైద్య, ఆరోగ్య శాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల అధిక బిల్లుల దోపిడీ సొమ్మును బాధితులకు ప్రభుత్వం ఇప్పించలేదు.. అని షబ్బీర్ అలీ విమర్శించారు.
తక్షణమే ప్రజా ఫిర్యాదుల యంత్రాంగాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలపై చేసే ఫిర్యాదులను నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని షబ్బీర్æ అలీ డిమాండ్ చేశారు. ‘సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఎన్జీవో ఇతరులు ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు.
కానీ, ప్రభుత్వం ప్రజల ఫిర్యాదుల యంత్రాంగాన్ని ట్విట్టర్ లేదా మరే ఇతర ప్లాట్ఫామ్లతో భర్తీ చేయదు. తెలంగాణలోని ప్రతి పౌరుడు ట్విట్టర్లో ట్వీట్ చేసే స్థాయిలో లేడు. ప్రతి వినియోగదారుడుకీ ట్విట్టర్ను ఉపయోగించే నైపుణ ్యం లేదు. ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్వపు ప్రజాఫిర్యాదుల విభాగాన్ని పునరుద్ధరించాలి. లేదంటే ప్రజలుఅసౌకర్యానికి గురికాకుండా తమ ఫిర్యాదులను నమోదు చేసే కొత్త యంత్రాంగాన్ని రూపొందించాలి ‘అని షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.