ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన మరోసారి గూఢచర్యం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. టెక్ ఫాగ్ అనే యాప్తో భారతీయ జనతాపార్టీ ఐటీ వింగ్ సోషల్ మీడియాలను హైజాక్ చేస్తున్నదని, సొంత ఎజెండాను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నదని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నిజంగానే ఆ యాప్ మనకు తెలియకుండానే మన అభిప్రాయాన్ని మార్చేస్తుంది? మన మనసులపై మాయపొరలను కమ్మేస్తుందా? మన ఇష్టాఇష్టాలపై పెను ప్రభావం చూపిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నిజానికి టెక్ఫాగ్ అనేది ఓ ప్రైవేటు యాప్. అత్యాధునిక టెక్నాలజీలతో ఈ యాప్ను రూపొందించారు.
బీజేపీ ఐటీ విభాగానికి చెందిన ఓ మాజీ ఉద్యోగి లాస్టియర్ ఏప్రిల్లోనే ఈ రహస్య యాప్ సంగతి వెలుగులోకి తీసుకొచ్చారు. తొలుత మీడియా ఫైల్ రూపంలో ఓ స్పైవేర్ను యాప్ నిర్వాహకులు రహస్యంగా పంపిస్తారు. దాని ద్వారా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంటారు.
మనకొచ్చే మెసేజ్లను మనం లైక్ చేయాలని అనుకోకపోయినా ఆటోమాటిక్గా లైక్ చేసేస్తాం. అంటే మనం దేన్ని ఇష్టపడాలో దేన్ని వ్యతిరేకించాలో కూడా యాప్ నిర్దేశిస్తుందన్నమాట. ట్విట్టర్లో ట్రెండింగ్ సెక్షన్ను, ఫేస్బుక్లో ట్రెండ్ విభాగాన్ని టెక్ఫాగ్ ప్రభావితం చేస్తుంది. మనం ఏదైనా ట్వీట్ చేస్తే ఆటో రీట్వీట్, ఆటో షేర్ టూల్స్ ద్వారా యాప్ నిర్వాహకులు చాలా స్పీడ్గా రీట్వీట్, షేర్ చేస్తారు.
మన ప్రమేయం లేకపోయినా మనది కాని మన అభిప్రాయాలను వేగంగా వ్యాప్తి చేస్తారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేక నెటిజన్లు గందగగోళానికి గురవుతారు. మన ఫోన్ కనుక టెక్ ఫాగ్ బారిన పడితే మాత్రం మన వ్యక్తిగత సమాచారం, ఫోన్ నంబర్లు మొత్తం యాప్ నిర్వాహుకుగు గప్పిట్లోకి వెళ్లిపోయినట్టే.