అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్వాదీ పార్టీలో చేరిపోయారు. ఈ విషయాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
బీజేపీలో కీలక ఓబీసీ నేతగా పేరున్న స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. యోగి సర్కార్లో ఓబీసీ, దళితులు, యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు. అయితే.. స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో ఇలా పేర్కొన్నారు.
భిన్నమైన భావజాలం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో అంకితభావంతో పనిచేశాను. కానీ దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్ర అణచివేతకు గురవుతున్నందున రాజీనామా చేస్తున్నానంటూ స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
తాను పార్టీ వీడటం బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తెలస్తుందని అభిప్రయా పడ్డారు. రాజీనామా చేసిన వెంటనే, SP చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్విట్టర్లోకి వెళ్లి మౌర్యను పార్టీలోకి స్వాగతిస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఇక స్వామి రాజీనామా తర్వాత యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. తొందరపాటు నిర్ణయాలు చాలాసార్లు తప్పు అని రుజువయ్యాయని అభిప్రాయ పడ్డారు. మరోసారి పార్టీ నాయకులతో చర్చలు జరపాలని మాజీ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.