కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి టిఆర్ఎస్ పార్టీ లోకి వలస వెళ్లిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి స్వార్ధం తప్ప మరొకటి లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్నారు. టిపిసిసి జనరల్ సెక్రటరీ రంగినేని జగదీశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే మర్చిపోయాడని అన్నారు.
ప్రజలను ప్రాంతాన్ని మరచిపోయిన ఎమ్మెల్యే కోటి 30లక్షల విలువ గల వాహనం కొన్నాడని ఆయన అన్నారు. శనివారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గాలి యాదవ్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సతీష్ మాదిగ, టిపిసిసి కార్యనిర్వాహణ కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, రంగినేని జగదీశ్వర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశంపై వారు మాట్లాడారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలలో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి స్వార్థ ప్రయోజనాలకు,స్వంత స్వలాభం కోసమే పార్టీ మారారని విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఓట్లు అడగడానికి కనీసం సిగ్గు,శరం ఉండాలన్నారు. సోమశిల సిద్దేశ్వరం వంతెన, మాదాసి కురువ కుల ధ్రువీకరణ పత్రాలు, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామని, 98 జీవో సమస్యలపై హామీ ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లడానికి కొద్దిగా ఆలోచించాలని నాయకులు అన్నారు.
అంతేకాకుండా కుడికిల్ల రైతులకు లేనిపోని ఆశలు చూపించి సొంత ప్రయోజనాలకు రైతులను మోసం చేసి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసి ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ మారి కేసు ఉపసంహరణ చేసుకొని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రజలకు ఏమి సమాధానం చెప్పి ఓట్లు అడుగుతావని ప్రశ్నించారు. టిఆర్ఎస్ కు ఓటు వేస్తే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఎమ్మెల్యేగా ఏడాది కాలంలో ఏమి అభివృద్ధి చేశావో ఆలోచించుకోవలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ గా అభ్యర్థి గాలి రాణీ యాదవ్ కు అవకాశం ఇవ్వడం పై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లోనే చివరిదాకా కొనసాగుతానని, ప్రజలకు సేవ చేసుకుంటామని చెప్పారు. అంతకు ముందు ఇచ్చిన మాట మరిచిన ఎమ్మెల్యే అనే కరపత్రాని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము యాదవ్, ఆది వసంత కుమార్, మండల అధ్యక్షుడు పరశురాం, ఓబీసీ సెల్ నాయకులు ముస్తఫా, ఖాదర్, రవి, కాంతారావు, క్రాంతి, రామానుజన్, గోపాల్, సిరాజ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.