బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు యారవ శ్రీనివాస్ అధ్యక్షతన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ నేరేడుచర్ల మండల కేంద్రము లోని యూనియన్ కార్యాలయంలో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్ట సవరణ వెనక్కి తీసుకోవాలని, 1996 భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నిధుల నుండి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని,55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి ఐదు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని,ప్రభుత్వం అడ్డా, అడ్డాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పనిముట్ల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికుల వివిధ సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 13న, జరిగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాని కార్మికులు విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుంజ రవీందర్, తుడుం అజయ్ కుమార్, బిక్షం, సైదులు,వెంకటమ్మ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.