హైకోర్టు ధర్మాసనం ఆదేశానుసారం ఆగస్టు 1 తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి బిల్లులు చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు Y.V.B.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కారణంతో ఆగస్టు 4వ తేదీన రాబోతున్న కోర్టు వాయిదాలో రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని ఆయన తెలిపారు.
నరేగా బిల్లుల బకాయిలు రూ. 2500 కోట్లు వెంటనే చెల్లించాలని కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎంపీడీఓ కు రాజేంద్ర ప్రసాద్ తెదేపా నాయకులతో కలిసి మెమోరాండం ఇచ్చారు. 2018 – 2019 సంవత్సరంలో ఉపాధి హామీ పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా డబ్బులు చెల్లించకపోవడం దారుణమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఉపాధి పనులు చేసిన వారిలో 80 శాతం మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన బిసి, ఎస్ సి, ఎస్ టి మైనార్టీలైన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మసనానికి ఎప్పటికప్పుడు కుంటి సాకులు చెబుతూ, ప్రతి వాయిదాకు అబద్దాలు చెబుతూ,కోర్టును తప్పు త్రోవ పట్టిస్తూ, బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తోందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
రూ. 2500 ల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి, తన స్వంత అవసరాలకు వాడేసుకోవడం వలనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. దీనివలన ఉపాధి పనులు చేసిన వేలాది మంది అప్పులపాలైపోయి బిల్లులు రాక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని, ఈ పాపం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం లో ఉయ్యూరు మండల తెదేపా అధ్యక్షులు యే నిగళ్ల కుటుంబరావు, జిల్లా ఎస్. సి సెల్ నాయకులు చేదుర్తి పాటి ప్రవీణ్, జిల్లా బి సి సెల్ నాయకులు జంపన వీర శ్రీనివాస్, చెరుకూరి ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.