రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 4039 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని గత వానాకాలంలో ఎలాగైతే ధాన్యాన్ని సేకరించామో దాదాపు అదే సగటుతో ఈ వానాకాలంలోనూ ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు.
గత 2020 సీజన్లో నవంబర్ 13వ తేదీ వరకూ దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ సీజన్లో సైతం నిన్నటివరకూ 1లక్షా 13వేలకు పైగా రైతుల నుండి 1510 కోట్ల విలువ గల 7లక్షల 71వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించామన్నారు. ధాన్యం రవాణాలోనూ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు కొన్న దాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, ఆకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో తగినన్ని టార్పాలిన్లు సైతం ఏర్పాటు చేసామని, అవసరమైన చోట సమకూర్చుకోవాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
77శాతం రేషన్ బియ్యం పంపిణీ
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ వేగంగా జరుగుతుందన్నారు మంత్రి గంగుల. నవంబర్ నెలకోసం 2,99,310 మెట్రిక్ టన్నుల కేటాయింపులకు గానూ ఇప్పటి వరకూ 77శాతం 2,29,231 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసామన్నారు. మొత్తం కార్డుల్లో దాదాపు 67లక్షల కార్డులు బియ్యాన్ని తీసుకున్నారని, పౌరసరఫరాల శాఖ సర్వర్లలో, ఈపాస్ మిషనరీల్లో ఎలాంటి సమస్యలు లేవన్నారు మంత్రి గంగుల కమలాకర్.