ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని, కుటుంబ సభ్యులే ఈ హత్యకు కారణమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి చిన్న దానికి మీడియా సమావేశాలు పెట్టి గోల చేసే వైసీపీ నాయకులు వివేకా హత్య కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఏమైపోయారు, ఈరోజు ఒక్కరూ మాట్లాడరేం? అని ప్రశ్నించారు.
సొంత బాబాయ్ హత్య గురించి ఆ రోజు సాక్షి పేపర్లో తాటికాయంత అక్షరాలతో మొట్ట మొదటి పేజీలో నారాసుర రక్తచరిత్ర అని రాశారు. మరి ఈ రోజు మీ పత్రికలో గాని మీ ఛానల్లో కానీ ఎక్కడ రాయలేదు ఎందుకని? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సొంత బాబాయ్ ఉదయం చనిపోతే సీఎం జగన్ రెడ్డి తాపీగా సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి ఈ హత్య చంద్రబాబునాయుడు చేయించాడని నానా యాగీ చేశారని నల్లపాటి గుర్తు చేశారు. తన తల్లి మీద పోటీ చేశాడనే కోపంతో వివేకానంద రెడ్డి హత్యకు జగన్ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
కుటుంబ సభ్యులే తన తండ్రిని చంపారు అని వివేకా కుమార్తె సునీత ఆనాడే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. వివేకానంద రెడ్డి చనిపోయిన ఒక్క నిమిషం లోనే గంగిరెడ్డి అక్కడకు వెళ్లి సాక్షాధారాలను మార్చేశారని నల్లపాటి ఆరోపించారు. చంద్రబాబు పై మాములుగా గెలవడం సాధ్యం కాదని తెలిసే ఇలాంటి హత్యా డ్రామాలకు ప్రణాళిక వేశారని ఆయన తెలిపారు.
కోడికత్తి కేసు కూడా ఈ కుట్రలో భాగమే. రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఎవరు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని నల్లపాటి అన్నారు. ఈ సమావేశంలో నరసరావుపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మెడబలిమి నవీన్, చల్లగుండ్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.