పెంచిన గ్యాస్ ధర సామాన్య ప్రజల బ్రతుకుల్లో గుదిబండగా మారిందని, వెంటనే నిత్యావసర ధరలు తగ్గించాలని తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు డిమాండ్ చేశారు. తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నకేశవులు మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజల బ్రతుకులు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలియం ధరలు పెరగడం వల్ల దీని భారం నిత్యావసర సరుకుల మీద పడిందని ఆరోపించారు.
పేద మధ్యతరగతి కుటుంబాలు ఏమి కొనేటట్టు ఏమి తినేటట్టు లేదని అన్నారు. ఏ వస్తువు చూసినా ధరలు ఆకాశాన్ని అంటాయి అని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భాజపా ప్రభుత్వం మళ్లీ గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచింది అని ధ్వజ మెత్తారు.
ఇప్పటికైనా పేద మధ్య తరగతి కుటుంబాల గురించి ఆలోచించి గ్యాస్ ధరల తో పాటు, అత్యవసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య,జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల శ్యాంసుందర్, పత్తి శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి కాడం వెంకటేష్, పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్, రూరల్ మండల గౌరవ అధ్యక్షుడు కాడం కథలయ్య మరియు రూరల్ మండల యువత అధ్యక్షులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.