రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు, ప్రజల సొమ్ము సలహాదారుల పాలుగా మారిందని, ఏ పనీ లేకుండానే ప్రజా ధనాన్ని తినేందుకు ఆశ పడటం సరైనది కాదని, వెంటనే ప్రభుత్వ సలహాదారుల పోస్టులకు రాజీనామా చేసి తప్పుకోవాలని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.ముఖ్యమంత్రికి సలహాదారులు ఉండటంలో తప్పులేదు కానీ, కేవలం తన పార్టీ కోసం పని చేశారన్న కారణంతో సలహాదారుల పోస్టులను సృష్టించి, ఉపాధి హామీ పథకంగా ప్రభుత్వం మార్చిందన్నారు.
నీటిపారుదల మంత్రికి ఒకరు, నీటిపారుదల కమిషనర్ కు మరొకరు, నీటి వనరులకు ఇంకొకరిని సలహాదారులుగా పెట్టారన్నారు. డిజిపి చీఫ్ కి ఇద్దరు,సిఐడి చీఫ్ కి ఒకరు,మిడిల్ ఈస్ట్ దేశాల ప్రత్యేక ప్రతినిధిగా ఇంకొకరు, ఆఖరికి ఢిల్లీ ఏపీ భవన్ లోను క్యాబినెట్ ర్యాంకు సలహాదారునిగా మరొకరిని నియమించినట్లు ఆరోపించారు.రాష్ట్రంలో దాదాపు 56 మందిని సలహాదారులుగా పెట్టి, అలవెన్స్ లు,వగైరాలు కాకుండా నెలకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున నెలకు రూ.
కోటి 68 లక్షల, ఏడాదికి 20 కోట్ల 16 లక్షలు, ఐదేళ్ళకు రూ. 100.80లక్షలు ఉచితంగా లబ్ధి చేకూరుస్తుందని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇందరు సలహాదారులు లేరని, ప్రజాధనాన్ని వృధా చేసేందుకే పందారం అని ఆరోపించారు. ప్రభుత్వ తుగ్లక్ విధానాలతో సలహాదారులు కూడా భాగం పంచుకోవడం క్షంతవ్యం కాదన్నారు.రాష్ట్ర హైకోర్టు సైతం సలహాదారుల నియామకాలపై నిప్పులు చెరిగిందని, రాజ్యాంగ నిబద్ధతను ప్రశ్నించిందని గుర్తు చేశారు.
సలహాదారుల పోస్టులకు రాజీనామా చేసి వ్యక్తిగత గౌరవాన్ని, ప్రజాధనాన్ని కాపాడాలని సూచించారు.లేకపోతే రాబోవు కాలంలో సలహాదారులు కూడా రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులుగా ప్రజల భావించే ప్రమాదం ఉందని బాలకోటయ్య హెచ్చరించారు.