‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా కేంద్ర రిజర్వు పోలీస్ దళం (సి.ఆర్.పి.ఎఫ్ )చేపట్టిన సైకిల్ ర్యాలీని ఈ రోజు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ జెండా ఊపి హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభించారు.
దేశం కోసం సి.ఆర్.పి.ఎఫ్ అందిస్తున్న సేవలను ఆమె ఆభినందించారు. ఈ సందర్భంగా సి.ఆర్.పి.ఎఫ్ అమరవీరుల కుటుంబాలను ఆమె సత్కరించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా సి.ఆర్.పి.ఎఫ్ ఏర్పాటు చేసిన ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తిని పెంపొందిస్తాయన్నారు. తెలంగాణ ప్రజలందరూ కోవిడ్ టీకా పట్ల భయం, సందేహం వీడి ముందుకు వచ్చి టీకా తీసుకొని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రజలను జాగృతం చేసే ఉద్దేశ్యంతో కన్యాకుమారి నుండి రాజ్ కోట్ వరకు తలపెట్టిన ఈ ర్యాలీని ఆగస్టు 22వ తేదీన సి.ఆర్.పి.ఎఫ్ ప్రారంభించింది. 20 మంది సభ్యుల సి.ఆర్.పి.ఎఫ్ సైకిల్ ర్యాలీ బృందానికి లెఫ్టినెంట్ కల్నల్ జస్బీర్ ప్రతాప్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సైకిల్ ర్యాలీ ఈ రోజు హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ కు బయలుదేరింది. ఈ ర్యాలీ మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ మీదుగా అక్టోబర్ 2 నాటికి రాజ్ ఘాట్ చేరుకోనుంది. చారిత్రిక స్వాతంత్ర సంగ్రామ స్థలాలు సందర్శిస్తూ ఈ సైకిల్ ర్యాలీ ప్రతి రోజు 70 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణిస్తూ మొత్తంగా 2850 కిలోమీటర్లు పూర్తి చేయనుంది.
ఈ కార్యక్రమంలో ఎక్స్-డిజిపి సి.ఆర్.పి.ఎఫ్ దుర్గా ప్రసాద్, తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్, సి.ఆర్.పి.ఎఫ్, సౌత్ జోన్ ఐజిపి జి.వి.హెచ్. గిరి ప్రసాద్, సి.ఆర్.పి.ఎఫ్ ఐజిపి మహేష్ చంద్ర లద్దా ఇంకా సి.ఆర్.పి.ఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ ఆంధ్ర నాట్యం, బోనాలు జానపద నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.