రష్యా కరోనా వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణీ చేసేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ పై సైబర్ దాడులు జరిగాయి.
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారం కోసం హ్యాకింగ్ జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా ఇప్పటికి వెల్లడి కాలేదు. ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ తన కార్యకలాపాలను నిలిపివేసింది.
తన డేటా సెంటర్ ను పూర్తిగా షట్ డౌన్ చేసింది. భారత్ లో ఉన్న దాదాపు అన్ని ఉత్పత్తి కేంద్రాలలో కార్యకలాపాలను నిలిపివేసింది. గురువారం తెల్లవారు జామున సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించారు.
డేటా పై సైబర్ దాడులు జరగడంతో ఫార్ములేషన్ల ను భద్ర పరిచి అన్ని రక్షణ చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అయితే ఈ కారణంగా తమ కంపెనీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కంపెనీ సిఐఓ ముఖేష్ రతీ వెల్లడించారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరించుకుంటామని ఆయన వివరించారు.
స్పూత్నిక్ వ్యాక్సిన్ రూపొందించడం లో కీలక పాత్ర పోషిస్తున డాక్టర్ రెడ్డీస్ పై ఇలా సైబర్ దాడులు జరగడం కొత్త కార్పొరేట్ పోరాటానికి దారి తీస్తున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.