వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఎం.ఎల్.ఏ జోగురామన్న సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నాలుగు ఓపెన్ జిం లను మంగళవారం మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ తో కలిసి ఆయన లాంచనంగా ప్రారంభించారు.
ముందుగా గాంధీ పార్క్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిం లో అందుబాటులో ఉంచిన పరికరాలను పరిశీలించారు. అనంతరం సరదాగా వ్యాయయం చేశారు.
ఓపెన్ జిమ్ లలో వ్యాయామం చేసేవారికి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు ఎం.ఎల్.ఏ జోగురామన్న మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
పట్టణ ప్రగతి కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు అవసరమైన ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.
వైద్యులు, నిపుణుల సూచనల మేరకు వ్యాయామం చేయాలనీ, తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు అర్చన రాం కుమార్, ప్రకాష్, పవన్ నాయక్, నాయకులు యూనుస్ అక్బని, బండారు సతీష్, సాయి కుమార్,తదితరులు పాల్గొన్నారు.