విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పనితీరు ప్రశంసనీయమని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు. ఈ బ్యాంకు అభివృద్దికి పాలకవర్గం, సిబ్బంది మరింత కృషి చేయాలని ఆయన కోరారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మహాజన సభ బ్యాంకు ఆవరణలో రెండవ తేదీ న జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు వాటా దారులకు 6 శాతం డివిడెండ్ ను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఒకప్పుడు 90 కోట్ల టర్నోవరు ఉన్న ఈ బ్యాంకు, ప్రస్తుతం సుమారు 1500 కోట్లకు చేరుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. దీనివెనుక బ్యాంకు సిబ్బంది, పాలకవర్గాల కృషి ఎంతో ఉందని చెప్పారు. ఒకప్పుడు మూతపడే దశకు చేరుకున్న సహకార బ్యాంకులకు, 216 కోట్లను షేర్ క్యాపిటల్గా ఇచ్చి, అప్పటి సీఎం వైఎస్సార్ ఆదుకున్నారని చెప్పారు. ఆ తరువాత బైద్యనాధ్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం తదితర చర్యల ద్వారా, సహకార బ్యాంకులు నిలదొక్కుకున్నాయని అన్నారు. బ్యాంకు వాటాదారులకు 6 శాతం డివిడెంట్ ఇవ్వడం చాలా గొప్పవిషయమని పేర్కొన్నారు.
రైతుల శ్రేయస్సు కోసం సీఎం జగన్ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలను అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. రుణాలను మంజూరు చేయడంతోపాటుగా, రికవరీపైనా దృష్టి పెట్టాలని, దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. డ్వాక్రా పొదుపు సంఘాల ఖాతాలను డీసీసీబీలో తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీసీసీబీకి, పిఏసిఎస్లకు కొత్త భవనాల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. పీఎసీఎస్ సీఈఓల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు. బ్యాంకును అభివృద్ది పథాన నడిపించేందుకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.
స్థానిక ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిలదొక్కుకొని, తిరిగి లాభాల బాటలో ప్రయాణించడం వెనుక, అప్పటి సీఎం వైఎస్ఆర్ సహకారం, మంత్రి బొత్స సత్యనారాయణ కృషి ఎంతో ఉందన్నారు. ఓటిఎస్ పథకాన్ని వినియోగించుకొనేందుకు డీసీసీబీ ద్వారా రుణాలను మంజూరు చేసి, లబ్దిదారులను ప్రోత్సహించాలని సూచించారు.
గాజులరేగ, జొన్నవలస పీఏసీఎస్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.డీసీఎంఎస్ ఛైర్పర్సన్ డాక్టర్ అవనాపు భావన మాట్లాడుతూ, రైతే దేశానికి వెన్నుముఖ అన్న ఉద్దేశంతో, రైతు సంక్షేమం కోసం సహకార సంఘాలను స్థాపించడం జరిగిందన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నిట్లో రైతుకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. డిసిఎంఎస్ ద్వారా ఈ నెల 6 నుంచి రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు.
డీసీసీబీ ఛైర్మన్ వేచలపు వెంకట చినరామునాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం సహకార బ్యాంకు పరిస్థితిని వివరించారు. 106 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల బ్యాంకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఈ స్థితికి చేరిందన్నారు. నాబార్డు, ఆప్కాబ్ చేత ఉత్తమ బ్యాంకుగా ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఇతర బ్యాంకుల కంటే తక్కువగా కేవలం 9 శాతం వడ్డీకే తమ బ్యాంకు రుణాలను అందజేస్తోందని తెలిపారు.
డ్వాక్రా సంఘాలచేత తమ బ్యాంకులో ఖాతాలను తెరిపించేందుకు అధికారులు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో డిసిసిబి సీఈఓ కె.జనార్ధన, పాలకవర్గ సభ్యులు చనుమల్ల వెంకటరమణ, పి.సంజీవి, ఏ.రాధ, బి.అప్పలనాయుడు, ఎల్.నారాయణరావు, ఎస్.కాంతారావు, ఆప్కాబ్, నాబార్డు ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వివిధ పిఏసిఎస్ల అధ్యక్షులు, శోభా హైమావతి తదితర డైరెక్టర్లు, పర్సన్ ఇన్ఛార్జీలు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.