జిల్లాల విభజన పారదర్శకంగా జరగాలంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్,ఆర్ధిక నిపుణులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ జరపాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుపతిలో గురువారం ఎస్వీ యూనివర్సిటీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,రాయలసీమ ఎకనమిక్ అసోసియేషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ చైర్మన్ ప్రొఫెసర్ A. రంగారెడ్డి అధ్యక్షతన జిల్లాల విభజనపై సదస్సు జరిగింది.
ఎకనమిక్స్ కమిటీ హాల్ లో జరిగిన ఈ సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, SVU ప్రొఫెసర్స్ కే. మునిరత్నం నాయుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం సి రెడ్డప్ప రెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ కంటిన్యూఇంగ్ ఎడ్యుకేషన్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధాకర్ రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి, బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ డైరెక్టర్ బి చంద్రారెడ్డి, శేషగిరిరావు, లక్ష్మమ్మ,కృష్ణమూర్తి, శమంతక మణి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి జిల్లాల విభజన ప్రభావం ఎలా ఉంటుంది లాభ నష్టాలు ఏమిటి అన్న దానిపై వక్తలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మెచ్చే విధంగా పది కాలాలపాటు అభివృద్ధి పథంలో జిల్లాలు పోటీ పడే విధంగా రాజకీయ స్వలాభాలకు అతీతంగా ఏపీ సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు.
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజనలో సాధ్యాసాధ్యాల పరిశీలన లోతుగా అధ్యయనం చేయాలని నెల రోజుల గడువులో జిల్లాలను విభజించడం సహేతుకం కాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో అధికారుల బదిలీల విషయంలో, ఆర్థిక వనరుల కేటాయింపులలో పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల పెత్తనంతో అభివృద్ధి అనేది కొన్ని జిల్లాలకే పరిమితం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
అన్ని జిల్లాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే నిపుణుల కమిటీతో అధ్యయనం చేసి సమగ్ర సమాచారంతో జిల్లాల విభజన చేయాలని ఆయన అన్నారు. కనీసం ఆరు నెలల గడువు తీసుకొని జిల్లాల విభజన జరిపితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల మధ్య ఎటువంటి నీటి వాటాల సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉండదన్నారు. అసెంబ్లీ సమావేశాలలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు జిల్లాల విభజన ప్రక్రియ గడువు పెంచేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు.