ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపే ధ్యేయంగా ఉపాధ్యాయులు పనిచేయాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖాధికారి యం. గోవిందరాజులు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఉర్కొండ, కల్వకుర్తి మండలాల్లోని ఉర్కండ, ఊరుకొండ పేట, మార్చాలా కల్వకుర్తి, పట్టణంలోని జడ్పీ బాయ్స్ కల్వకుర్తి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కల్వకుర్తి కేజీబీవీని సందర్శించి అక్కడ జరుగుతున్న రీడ్ ప్రోగ్రామ్ ను పరిశీలించి, ఉపాధ్యాయులు, విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు.
మార్చాలా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని వంట మనుషులకు సూచించారు. అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలను డిఇఓ పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెరిగినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు. విద్యార్థుల్లో ఇమిడి ఉండే ప్రతిభను వెలికి తీసే పనిని తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించి ఉపాధ్యాయులు విద్యార్థుల విద్య అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకుని ఆశయాలను సాధించే విధంగా వారిని తీర్చి దిద్దే అంశంలో ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, సామర్థ్యాన్ని పొందాలని ఆయన కోరారు. చదువుపై విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించడం ఉపాధ్యాయుల విధి అని ఆయన అన్నారు. తమ ప్రవర్తన, నడవడిక బోధన ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తుకు రూపకర్తలుగా పనిచేయాలని డిఈఓ సూచించారు.
ప్రతి విద్యార్థి విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ, మనస్తత్వం, సామాజిక నేపథ్యం కలిగి ఉంటారని,దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి విద్యార్థి అవసరాలను గుర్తించి వీటిని అందించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
జ్ఞానం ఆధారంగా న్యాయమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడే విద్యను విద్యార్థులకు అందించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల నుండే విద్యార్థులు రాజ్యాంగ విలువలు మరియు దేశభక్తి భావనను అలవరచి మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా భోధన జరగాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులకు రూపకల్పన చేసింది అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆంగ్ల బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాప్రమాణాలతో మెరుగైన అవకాశాలు మన విద్యార్థులకు లభించనున్నాయన్నారు. డీఈవో వెంట కల్వకుర్తి మండల విద్యాధికారి బాసు నాయక్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.